26, మార్చి 2014, బుధవారం

పోటీ, పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారా

విశాఖపట్నం: విశాఖపట్నంలో రేపు గురువారం జరిగే సభలో జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొని ఉంది. జనసేన ఆవిర్భావ సభ హైదరాబాదులో జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ సభ ఇదే. ఆవిర్బావ సభలో ఆయన పొత్తులపై, ఎన్నికల్లో పోటీపై అస్పష్టంగా చెప్పారు. విశాఖ సభలో ఆయన స్పష్టత ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదో అని హైదరాబాదు సభలో ఆయన అన్నారు. అలాగే, కాంగ్రెసు తప్ప మిగతా ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో పనిచేయబోమని, బిజెపి వంటి జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన కార్యాలయం పవన్ కళ్యాణ్ పేర ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆనుసరించే వైఖరిపై రేపు విశాఖ సభలో స్పష్టత ఇస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

బిజెపితో ఆయన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. అయితే, ఆయన పార్టీ పోటీ చేసే స్థానాలు ఏవి అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన పార్లమెంటుకు పోటీ చేయడానికే సుముఖంగా ఉన్నట్లు ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి.

అన్నయ్య చిరంజీవిపై ఆయన తొలి సభలో సున్నితంగానే అయినా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి సున్నితంగానే ఆయినా తమ్ముడు పవన్ కళ్యాణ్‌పై సుతిమెత్తని విమర్శలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగానే మారింది.
ఆయన రేపు విశాఖసభలో ఇజం అనే పుస్తకాన్ని విడుదల చేస్తారు. తాను ఆంగ్లంలో రాసిన 150 పేజీల ఈ పుస్తకంలో తన పార్టీ వైఖరిని, విధివిధానాలను స్పష్టం చేస్తారని అంటున్నారు. ఆయన హైదరాబాద్ సభ తర్వాత అన్ని పార్టీల నాయకులు ఏదో రూపంలో పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానాలు ఇస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.

ఇజంలో ఏముంది.. పవన్ కళ్యాణ్ తన ఇజం పుస్తకంలో 2007 నుంచి తన అనుభవాల నేపథ్యంలో సైద్ధాంతిక ప్రాతిపదికను వివరించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి ఆ పుస్తకాన్ని రాసినట్లు తెలుస్తోంది. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. వ్యక్తికి, సమాజానికి సైద్ధాంతిక పునాది అవసరమని పుస్తకంలో పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. న్యాయం కోసం తపిస్తున్న అందరకీ ఈ పుస్తకం అంకితమని పవన్ కళ్యాణ్ చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి