28, మార్చి 2014, శుక్రవారం

సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

మిర్పూర్: టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లా విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఆటగాళ్లు 18.3 ఓవర్లో ఛేదించారు. ఆదిలోనే ఓపెనర్ శిఖర్ థావన్ (1) పరుగుకే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56) పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు విరాట్ కోహ్లి (56*) పరుగులతో చేసి భారత్ విజయానికి సహకరించాడు.  చివర్లో కెప్టెన్ ధోని సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో ఓటిమితో బంగ్లాదేశ్ మాత్రం సెమీస్ ఆశలను దాదాపు చేజార్చుకుంది.
 
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరంభంలోనే బంగ్లాను కట్టడి చేశాడు. అశ్విన్ వరుస బంతుల్లో తమీమ్ ఇక్బాల్, షమ్సూర్ రహ్మాన్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ షకీబల్ ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆ తర్వాత బంగ్లా రన్ రేట్ మందగించింది. అనముల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (24) బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా భారత బౌలర్ షమీ.. రహీంను అవుట్ చేయగా.. ఆ వెంటనే అమిత్ మిశ్రా అనముల్ ను బౌల్డ్ చేశారు. చివర్లో భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించలేకపోయారు. మహ్మదుల్లా (33 నాటౌట్), నాసిర్ హుస్సేన్ (16) రాణించి బంగ్లాకు సముచిత స్కోరు అందించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి